newsseals.com
News

బీఎల్ సంతోష్ కామెంట్స్ బ‌క్వాస్ : ప్రియాంక్ ఖ‌ర్గే

Posted by: VijayaBhaskar August 16, 2026
newsseals-PriiyankKharge

బెంగ‌ళూరు : రజాకార్ల పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రపై సంతోష్ వాదనను రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ చేశారు . రజాకార్లు ఖర్గే కుటుంబంపై దాడి చేశారని, ఆర్‌ఎస్‌ఎస్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిందని సంతోష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అటువంటి వాదనలు చేసే ముందు చరిత్రను పరిశీలించాలని ఖర్గే ఆయనకు సూచించారు. రజాకార్ల పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర బ‌క్వాస్ అని పేర్కొన్నారు. సంతోష్ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ , భారత సైన్యం నిర్ణయాత్మక జోక్యం వల్లే సాధ్యమైందని, ఆర్‌ఎస్‌ఎస్ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిందని మీరు అంటున్నారు. రజాకార్ల కాలంలో ప్రజలను రక్షించామని మీరు చెప్పుకుంటే, దేశ విభజన తర్వాత మత ఘర్షణలు చెలరేగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ సంస్థ వల్లే మత ఘర్షణలు జరిగాయి అని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల ప్రభావానికి లోనైన నాథూరామ్ గాడ్సే చేతిలో గాంధీజీ హత్యకు గురైన తర్వాత కోల్‌కతా , ఢిల్లీలలో మత ఘర్షణలు జరిగాయని అన్నారు. మత ఘర్షణల సమయంలో ప్రజలను రక్షించే సంస్థ కాదు మీది, మత ఘర్షణలను సృష్టించే సంస్థ అని ఆయన ఆరోపించారు. నాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి దారితీసిన 1948 నాటి సైనిక చర్య ‘ఆపరేషన్ పోలో’ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమిటో వివరించాలని ఖర్గే సంతోష్‌కు సవాల్ విసిరారు.