పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి : చంద్రబాబు

అమరావతి : ఆరునూరైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోలవరం ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్నారు. జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం అని తెలిపారు.ఎల్ నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టడం జరిగిందని చెప్పారు .36 ప్రాజెక్టులను రూ.35,555 కోట్లతో నిర్మించేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం అన్నారు. ఈ 36 ప్రాజెక్టులు పూర్తి అయితే 19.16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుందని చెప్పారు.. 9 లక్షల ఎకరాలకు పైగా స్థీరికరించేందుకు వీలు కుదురుతుందన్నారు సీఎం.
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమయ్యే ప్రాజెక్టు కాదని మరోసారి స్పష్టం చేశారు. పోలవరంతో గోదావరి జలాలను అనకాపల్లికి తెస్తున్నాం అన్నారు. ఎడమ కాల్వ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేయి టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. వృధాగా పోతున్న జలాల్లో 30-40 టీఎంసీలు విశాఖకు తేవడం కష్టం కాదన్నారు సీఎం. విశాఖలో పారిశ్రామిక అవసరాలు, డేటా సెంటర్లకు నీళ్లు అందిస్తాం అని చెప్పారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి.. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు చంద్రబాబు నాయుడు.