newsseals.com
News

పంటల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలి

Posted by: VijayaBhaskar August 20, 2026
newsseals-CMD

పాల‌మూరు జిల్లా : వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థిరమైన వ్యవసాయాభివృద్ధి సాధించేందుకు పంటల వైవిధ్యీకరణ కూరగాయల సాగు, ఉద్యాన పంటలు , అధిక దిగుబడుల సాధనపై రైతులు దృష్టి సారించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని షేర్‌పల్లి గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. వాతావరణ మార్పులుమా, ర్కెట్ అవసరాలు, నీటి లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ పంటలతో పాటు కూరగాయలు, ఉద్యాన పంటలు , అధిక విలువ కలిగిన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందడమే కాకుండా వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించ వచ్చని చెప్పారు సీఎండీ.

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ సాంకేతికతలు, ప్రభుత్వ శాఖలు అందించే మార్గదర్శకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవనం , పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కూడా ఆదాయ వనరులుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని తమ ఆదాయాన్ని పెంచు కోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ, ఉద్యాన పంటల సాగు , నూతన సాంకేతికతల వినియోగం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావచ్చని తెలిపారు. జిల్లాలో ఉద్యానవన రంగ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.