నాణ్యమైన యూనిఫాంలను అందించక పోతే ఎలా..?

హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్యవస్థ దారుణంగా దిగజారి పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి విద్యా విధానం గురించి మాట్లాడే మీరు కనీసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారా అని నిలదీశారు హరీష్ రావు. కొన్ని చోట్ల యూనిఫాంలు ఇంకా చేరలేదు. చేరిన చోట్ల కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడి పోతున్నాయి. ఉతికితే రంగులు వెలిసి పోతున్నాయి. రెండు జతల యూనిఫాంలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల కనీసం ఒక్క జత కూడా పూర్తిగా అంద లేదని ఎందుకని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ మిల్లు యజమానుల పట్ల సీఎం క ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికుల పట్ల ఎందుకు లేదంటూ భగ్గుమన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫాంల తయారీకి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా కమిషన్ల కోసం పెద్ద కార్పొరేట్ సంస్థల నుండి నాణ్యత లేని యూనిఫాంలను తెప్పించి విద్యార్థులకు , చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు .ఉచిత పథకాలు సరే కానీ చేనేత వద్దు అనే స్థాయికి ప్రభుత్వం వైఖరి మారిందా అని పేర్కొన్నారు హరీష్ రావు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి దెబ్బ కలుగుతోందని, ఇంకో వైపు విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫాంలు సరఫరా చేయడం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యారు.