అనధికారికంగా నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చేయాలి

హైదరాబాద్ : సైబరాబాద్లో అనధికారికంగా నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చివేయాలని సీఎంసీ ఆదేశించింది. గచ్చిబౌలిలో భవనం కూలి ఇద్దరు కార్మికులు మరణించిన ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎంసీ కమిషనర్ జి. శ్రీజన. అంజయ్య నగర్లో ఏడు అంతస్తుల అక్రమ అపార్ట్మెంట్ కూలి ఇద్దరు కార్మికులు మరణించిన రెండు రోజుల తర్వాత, నిర్దిష్ట వర్గాల పరిధిలోకి వచ్చే అనధికారిక నిర్మాణంలో ఉన్న భవనాలను గుర్తించి కూల్చివేయాలని సోమవారం టౌన్ ప్లానింగ్ , ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఆదేశించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 7 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న నిర్మాణ భవనాలను, 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో ఎటువంటి భవన నిర్మాణ అనుమతి లేకుండా, నిర్మాణ ఎత్తుతో సంబంధం లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించాలని స్పష్టం చేశారు.
ఈ వర్గాల కింద గుర్తించిన నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ బలవంతపు చర్యల ద్వారా కూల్చి వేయాలని ఆమె బృందాలను ఆదేశించారు. అంతే కాకుండా పౌరుల ఫిర్యాదుల ద్వారా గానీ లేదా సంబంధిత క్షేత్రస్థాయి బృందాలు స్వయంగా గుర్తించడం ద్వారా గానీ, ఏ విధంగా గుర్తించినా సరే, అటువంటి కేసులను తప్పనిసరిగా గుర్తించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కఠినమైన పర్యవేక్షణను కొనసాగించాలని, అటువంటి నిర్మాణాలను వెంటనే గుర్తించి, అవసరమైన బలవంతపు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కమిషనర్.