సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకం

హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , సంపాదకుడు అయిన సూరవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం (బయోపిక్) అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ నిర్మించిన “సూర్యవరం” (బయోపిక్) చిత్రానికి సంబంధించిన 2 గంటల 40 నిమిషాల నిడివి గల ప్రివ్యూ ప్రదర్శన హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస్ గౌడ్తో పాటు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, తెలంగాణ సారస్వత పరిషత్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షుడు కొండ లక్ష్మీకాంత్ రెడ్డి, సన్షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సురవరం ప్రతాప్ రెడ్డి సేవలను కొనియాడారు. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజల దుస్థితి, పేదరికం, కనీస హక్కులు కూడా విస్మరించబడిన పరిస్థితుల పట్ల చలించిపోయి ప్రజలలో చైతన్యం నింపిన సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని, చరిత్రను తెలుసు కోవడానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ ఆధిపత్యం ఉన్న సమయంలో మాతృభాష అయిన తెలుగులో చదువుకునే అవకాశాలు లేని ఆ రోజుల్లో ప్రతాప్ రెడ్డి తెలంగాణలో చైతన్యం నింపిన సన్నివేశాలు నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు. నిజాం కాలం నాటి చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రస్తుత తరం “సూర్యవరం” చిత్రాన్ని తప్పక చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు బి.ఎం. రెడ్డి, జి. హర్షవర్ధన్ రాయల్, రచయిత బి. విజయ్ ప్రసాద్, సురవరం కుటుంబ సభ్యులు డాక్టర్ కృష్ణవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, కపిల్, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.