newsseals.com
News

టీపీసీసీ సోష‌ల్ మీడియాకు వంశీకృష్ణ రాజీనామా

VijayaBhaskar October 23, 2025
newsseals-tpccssocialmedia
Spread the love

సంస్థ చైర్మ‌న్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కార్య‌ద‌ర్శి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సోష‌ల్ మీడియాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పెండ్యాల వంశీకృష్ణ తాను త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది నా ఒక్కడి సమస్య కాదని, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సమస్య అని పేర్కొన్నారు. పార్టీలోని ఇతర విభాగాల చైర్మన్ల మార్పులాగే, సోషల్ మీడియా చైర్మన్ కూడా మారితే మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చేలా పని చేయాలని చూశామన్నారు. రాష్ట్రంలోని సోషల్ మీడియా నాయకులందరికీ దైర్యం చెప్తూ వచ్చామ‌న్నారు.

మీ ఆఫీసులో పని చేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి పార్టీ పదవులు ఇవ్వగలిగారు అంటే, పార్టీలో మీకెంత పవర్ ఉందో ఊహించగలం. కానీ ఆ పవర్ ను పనిచేసిన కార్యకర్తల కోసం ఉపయోగించి ఉంటే కనీసం ఒక్కరైనా బాగు పడేవారన్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించి, పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు పొంది, పదవులు అనుభవించిన వారికి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం కృషి చేశారో అలాంటి వారికి రాష్ట్ర స్థాయి, పార్లమెంట్ స్థాయి సోషల్ మీడియా పదవులు ఇవ్వడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇది పార్టీకి అంతర్గత సమస్యలు తెచ్చిపెడుతుందని, చివరగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటేన‌ని .. పార్టీ అంటే కార్యకర్తల సమూహం, వారికిచ్చే గౌరవం వారికి ఇవ్వాలని అన్నారు. కార్యకర్తలను ఉద్యోగులుగా మార్చి, పార్టీని కార్పొరేట్ ఆఫీస్ లాగా మార్చి, వారిని మీ చెప్పు చేతల్లో ఉంచాలను కోవడం పార్టీ విధానాలకు విరుద్ధం అన్నారు. మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే.. కేవలం 20 మంది చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు, పది లాప్ టాప్ లు  మాత్రమే కాదన్నారు. పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేసిన కార్యకర్తల మాదిరిగ, కష్టకాలంలో పార్టీకోసం స్మార్ట్ ఫోన్ తో  కాంగ్రెస్ జెండాను, ఎజెండాను 365 రోజులు పనిచేస్తూ ప్రజలకు చేరవేసిన వేలాది కార్యకర్తల కృషి మీరు అనుభవిస్తున్న ఆ పదవి అని స్ప‌ష్టం చేశారు.

ఈ రాజీనామా వెనుక ఎవరి ప్రోద్బలం లేదన్నారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. నా రాజీనామాతో అయినా , పార్టీ నాయకత్వం స్పందించి, సమావేశం నిర్వహించి, నా తోటి సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని అన్నారు .