newsseals.com
News

బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

Posted by: VijayaBhaskar November 27, 2025
newsseals-MinisterSavitha

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

విజయవాడ : అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే ఆదరణ 3.0 నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో బీసీలను అన్ని రకాల వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ నగరంలోని గొల్లపూడి బీసీ భవన్ లో సగర కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు.

బడుగు, బలహీన వర్గాల ఉన్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు తీసుకు రావడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. బీసీల కుల వృత్తులకు ఆర్థిక భరోసా కలిగించేలా ఆదరణ 3.0 పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఆయా బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల నేతృత్వంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్ప‌ష్టం చేశారు.