newsseals.com
News

జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Posted by: VijayaBhaskar November 29, 2025
newsseals-AnithaVangalpudi

ఆదేశించిన హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్‌ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శ‌నివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. NDRF, SDRF బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు మంత్రి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అంతే కాకుండా ప్ర‌జ‌ల బాగు కోసం అత్యవసర సహాయక చర్యలకు గాను టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101లో సంప్రదించాలని సూచించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అత్యంత అవ‌స‌ర‌మైతే త‌ప్పా ప్ర‌జ‌లు, రైతులు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. అంతే కాకుండా స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎలాంటి విప‌త్తుల‌నైనా ఎదుర్కొనేందుకు కూట‌మి స‌ర్కార్ సిద్ద‌మై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఈ స‌మావేశంలో విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ పాల్గొన్నారు.