newsseals.com
News

ఎన్టీఆర్ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట

Posted by: VijayaBhaskar September 15, 2025
newssealsayyannapatrudu

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

తిరుప‌తి : మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త ఆనాటి సీఎం ఎన్టీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1983లో తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో మహిళా శాసన సభ్యులు లేరని, మహిళా పంచాయతీ అధ్యక్షులు లేరని పేర్కొన్నారు. కానీ నందమూరి తారకరామారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, అదే విధంగా అన్ని రాష్ట్రాల్లోను జరగాలని అన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 22 మంది మహిళా శాసన సభ్యులు ఉన్నారని, శాసన మండలిలో కూడా మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు.

మహిళలకు విద్యా, ఉపాధి, ఆర్థిక రంగాల్లో అవకాశాలు కల్పిస్తే ఏ రాష్ట్రం అయినా, ఏ జిల్లా అయినా అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు. సురక్షిత సమాజ నిర్మాణం మనమందరం కలసి సాధించాల్సిన లక్ష్యమని తెలిపారు. ఈ సదస్సు ద్వారా సాధికారత అనేది పార్టీలు, రాష్ట్రాలు, భాషలు, సరిహద్దులు అన్నిటికీ అతీతమని, ఇది జాతీయ లక్ష్యమని అన్నారు. మహిళా సాధికారతకు పునాది వేసిన దార్శనికులు నందమూరి తారక రామారావు అని, ఆ దారిని మరింత బలపరిచిన ఘ‌న‌త ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబుకు ద‌క్కుతుంద‌న్నారు స్పీక‌ర్. మహిళల శక్తే సమాజ ప్రగతి శక్తి. ఆ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే దేశం మరింత బలపడుతుంద‌న్నారు. ఈ సదస్సులో తీసుకున్న ఆలోచనలు, తీర్మానాలు పత్రాలలోనే కాకుండా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు స్పీక‌ర్.