newsseals.com
DEVOTIONAL

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Posted by: VijayaBhaskar February 27, 2026
newsseals-TTD

వివ‌రాలు వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసి వేత‌. 15న వైష్ణవ ఏకాదశి నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం. 28న శ్రీరామ పట్టాభిషేకం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం అవుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తెప్పోత్స‌వాలు తిరుమ‌ల‌లో అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్స‌వాల‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి – వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ, 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.