newsseals.com
News

ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

Posted by: VijayaBhaskar April 1, 2026
newsseals-APScoch

ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో డిజిటలైజేషన్ చేపట్టినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి ఎన్నో సాంకేతికతను ప్రవేశపెట్టామని తెలిపారు మంత్రి ఎస్. స‌విత‌. ఈ కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో చేపట్టిన సంస్కరణలతో చేనేత అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆప్కో చేపట్టిన డిజిటిలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం స్కోచ్ అవార్డు ప్రకటించింది.

నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం కీలకమైన ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింద‌న్నారు ఎస్. స‌విత‌. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్ మగ్గాల నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతుంది. 1, 04,000 మంది చేనేత కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ఈ పథకం అమలైతే నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనడంలో సందేహం లేదు.