newsseals.com
News

నోట్ల ర‌ద్దు లాంటిదే డీ లిమిటేష‌న్ బిల్లు

Posted by: VijayaBhaskar April 18, 2026
newsseals-ShashiTharoor

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శ‌శి థ‌రూర్

న్యూఢిల్లీ : తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఇది అనూహ్యంగా వీగి పోయింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లు ప‌న్నిన కుట్ర‌ల‌ను బ‌హిర్గం చేశారు స‌భ సాక్షిగా రాహుల్ గాంధీ, శ‌శి థరూర్. ‘నారీ శక్తి’ పేరిట ప్రధాని మోదీ మహిళలకు ముండ్ల తీగలతో చుట్టిన బహుమతిని ఇస్తున్నారని ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ‘రాజకీయ నోట్ల రద్దు’గా మారబోతున్నదని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో థరూర్‌ మాట్లాడారు.

నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవ భారతదేశం వైపు పడే అడుగులు విచ్ఛిన్న భారత్‌ను ఇచ్చేదిగా ఉండకూడదని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం మహిళల ఆకాంక్షలను మరింత దూరం చేయడమేనని తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సంబంధిత అన్ని వర్గాలతో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో, పౌర సమాజంతో విస్తృత సంప్రదింపులు జరపాలని సూచించారు. ఆదరాబాదరాగా చేయకూడదని సూచించారు. డీలిమిటేషన్‌ను పక్కన పెట్టి మహిళా బిల్లును ఆమోదించాలన్నారు.