newsseals.com
DEVOTIONAL

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర

Posted by: VijayaBhaskar April 23, 2026
newsseals-BhashyakarlaTTd

అంగ‌రంగ వైభ‌వోపేతంగా స్వామి వారి అభిషేకం

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వ‌హించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడక దారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్ల వారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి భాష్యకార్ల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.