newsseals.com
News

కాలుష్య ర‌హిత ప్ర‌జా ర‌వాణా ల‌క్ష్యం

Posted by: VijayaBhaskar May 28, 2026
newsseals-Ponnam

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక అడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి ప్ర‌సంగించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

కార్మిక సంక్షేమం గురించి మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎన్నికైన సంఘాలతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు పీఆర్‌సీ (PRC) అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.