newsseals.com
News

రేపే ఢిల్లీలో జనసేన కీల‌క సమావేశం

Posted by: VijayaBhaskar June 14, 2026
newsseals-PawanKalyan

దిశా నిర్దేశం చేయ‌నున్న డిప్యూటీ సీఎం

అమ‌రావ‌తి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వివరించనున్నారు.

జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి .వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు.