newsseals.com
News

ఆర్డీఎస్ కు నీళ్లు అంద‌డం లేదు : సీఎం

Posted by: VijayaBhaskar June 25, 2026
newsseals-CM

పంచాయ‌తీలు వ‌ద్దు ప‌రిష్కార‌మే ముద్దు

క‌ర్ణాట‌క : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటాన‌ని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్ లో జ‌రిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్ర‌సంగించారు.ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదని, మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం అని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతుల సమస్యలను ఈ గేట్ల పునరుద్ధరణ పరిష్కరించ బోతోందని చెప్పారు.

కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ మూడు రాష్ట్రాల సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారిస్తారని నమ్ముతున్నాన‌ని అన్నారు. గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS) కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటోంద‌ని వాపోయారు సీఎం. దాదాపు 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేద‌న్నారు. తుంగభద్రలో మట్టి పేరుకు పోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం అన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సమావేశంలో నిర్ణయించుకున్నాం అని తెలిపారు.