కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించాలి

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ జగిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. సరైన మౌలిక సదుపాయాల కల్పన కోసం భూమి కేటాయింపును 5 ఎకరాల నుండి పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు. జూలై 3 నాటి లేఖలో, చెల్గల్ గ్రామంలో పాఠశాల కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరాన్ని తీర్చినప్పటికీ, మెట్రోయేతర ప్రాంతాలకు 10 ఎకరాల భూమి అవసరమని ఆయన పేర్కొన్నారు.
తరగతి గదులు, క్రీడా మైదానాలు, ప్రయోగశాలలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరమని మే 19, 2026 నాటి తన మునుపటి లేఖను ప్రస్తావిస్తూ అరవింద్ పునరుద్ఘాటించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి కనీస అవసరాలకు మించిన సౌకర్యాలు జగిత్యాల జిల్లా విద్యార్థులకు అవసరమని ఎంపీ అరవింద్ నొక్కి చెప్పారు. ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, మెరుగైన అభ్యాస అవకాశాలు , సకల సౌకర్యాలతో కూడిన క్యాంపస్ కోసం భూమి కేటాయింపును పెంచే విషయాన్ని పునః పరిశీలించాలని ఎంపీ ముఖ్యమంత్రిని కోరారు.