24 నుండి శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి / తాళ్లపాక : అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయాల్లో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూలై 24 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు రెండు ఆలయాల్లోనూ బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 24న అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. జూలై 25 నుండి ఆగస్టు 2 వరకు స్వామి, అమ్మవార్లు ప్రతిరోజూ వివిధ దివ్య వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు.
అలాగే జూలై 30న సాయంత్రం 6 గంటలకు కల్యాణోత్సవం, ఆగస్టు 3న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఆర్చీలు, ఫ్లెక్సీలు తదితర ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ వాహనసేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలని సూచించారు.
అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దివ్య కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, సీఈ టి.వి. సత్యనారాయణ, డిప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్ తదితర అధికారులు పాల్గొన్నారు