newsseals.com
News

ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

VijayaBhaskar September 29, 2025
newssealss-ktr
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు మళ్లీ అవే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రదీప్ చౌదరి వంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.