newsseals.com
DEVOTIONAL

వైభ‌వోపేతం శ్రీ‌వారి గ‌రుడ సేవ మ‌హోత్స‌వం

Posted by: VijayaBhaskar September 29, 2025
newsseals-garudavahanam

వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం

తిరుమ‌ల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.
సాయంత్రం 6 గంటల పైన గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడుని పై తిలకించి భక్తి పారవస్యంలో పులకించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించుకున్నారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ జెబుతున్నాడు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం,
సివిఎస్వో మురళి కృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.