newsseals.com
News

కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

VijayaBhaskar November 25, 2025
newsseals-MPgruurthy
Spread the love

ఎంపీ గురుమూర్తిని క‌లిసి విజ్ఞాప‌న ప‌త్రం స‌మ‌ర్ప‌ణ

తిరుప‌తి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్న‌వించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి బకాయిలు ఇంకా చెల్లించక పోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 1997 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు గ్రాట్యూటీ చెల్లించలేదని, 110 మంది శాశ్వత ఉద్యోగులకు గత 10 నెలలుగా జీతాలు చెల్లించక పోవడం తీవ్ర అన్యాయమని ఎంపీకి వివరించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి గ్రాట్యూటీ ఇవ్వలేదని, వారికి కేటాయించిన క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అప్పటి కేంద్ర జౌళి శాఖా మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ప్రత్యేకంగా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మిల్లు పునరుద్ధరణకంటే ముందుగా పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలు, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరగా, ఆ సమయంలో ప్రభుత్వం మొత్తం బకాయిలను చెల్లించి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడక పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను మరోసారి పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు.