newsseals.com
DEVOTIONAL

టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

VijayaBhaskar January 4, 2026
newsseals-TTDEO
Spread the love

త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఆలయ శిల్పాలు , చిత్రాలను మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించాలని సూచించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆచారాలను ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రసారం చేస్తున్న తరహాలో, టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రత్యేకతను, ప్రాముఖ్యతను భక్తులకు తెలియ జేయడానికి అవసరమైతే, ఎస్వీ బీసీ కింద మరో ఛానెల్‌ను ప్రారంభించే సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఈవో ఆదేశించారు. ఈ ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి, అభివృద్ధి పనులపై నివేదికలను సిద్ధం చేయాల‌న్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ ఆలయాలలో అన్నదానం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా, ప్రతి ఆలయానికి ఒక సాధారణ ఖాతా , అన్నదానం కోసం ప్రత్యేక ఖాతా ఉండాలని, ఈ రెండు ఖాతాలను ప్రత్యేక అధికారులు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నప్రసాదం కోసం ఉన్న ప్రస్తుత ఖాతాలను కొనసాగించాలని స్ప‌ష్టం చేశారు సింఘాల్.