newsseals.com
News

ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే పండ్ల మొక్క‌లు పెంచాలి

Posted by: VijayaBhaskar January 20, 2026
newsseals-PawanKalyan

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని పర్యావ‌ర‌ణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామ‌న్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలని సూచించారు. కాలువగట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. అందుకు సంబంధించి శాఖల వారీ యాక్షన్ ప్లాన్ అవసరం అన్నారు. నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50 శాతం గ్రీనరీ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రితో చ‌ర్చించామ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. లక్ష్యాలకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్దతతో ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలని అన్నారు. సమీక్షా సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ, రవాణాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారుల, మల్లికార్జునరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రంజిత్ భాషా, ఏపీఐఐసీ వి.సి.ఎం.డి. అభిషిక్త్ కిషోర్, నీటిపారుదలశాఖ, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.