newsseals.com
News

2027 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

VijayaBhaskar February 3, 2026
newsseals-Atchaannaidu
Spread the love

ప్ర‌క‌టించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

విజ‌య‌వాడ : రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉండ‌డం వ‌ల్ల‌నే రాష్ట్రం అన్ని రంగాల‌లో అభివృద్ది దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని చెప్పారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు హితంగా సహకరించడం వల్ల కేవలం 20 నెలల్లోనే రాష్ట్రం ఊహించని విధంగా గాడిలో పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ,కేంద్ర సహకారంతో అమరావతిని చట్టబద్ధ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులు వస్తున్నాయని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగం, గ్రామీణాభివృద్ధి, మధ్యతరగతి, రైల్వే కారిడార్ అభివృద్ధికి గణనీయమైన సహాయం అందిందన్నారు.

చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలకు మారు పేరన్నారు. ఆయనపై పెట్టిన తప్పుడు కేసులను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయని, స్కిల్ కేసులో 52 రోజులు జైలులో పెట్టినా, చివరకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన కుట్ర అని స్పష్టమైందన్నారు. జరిగిన కొన్ని సంఘటనలపై బాధ ఉన్నా, ప్రతిచర్య పేరుతో హింసకు దిగడం సరైనది కాదన్నారు. పల్నాడు, పలమనేరు, గుంటూరు వంటి ప్రాంతాల్లో అలజడులు సృష్టించే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా అరికట్టారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అణిచివేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నామన్నారు.