newsseals.com
News

విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

Posted by: VijayaBhaskar March 23, 2026
newsseals-NaraLokesh

84వ రోజు వినతి పత్రాల స్వీకరణ

విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమ‌వారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి వినతిపత్రాలు అందజేశారు. తమకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో విద్యుత్ శాఖ ఏఈఈ , జెఎల్ఎం పోస్టులను కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని పలువురు అభ్యర్థులు విన్నవించారు. కొత్తగా ప్రారంభించబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తమ సేవలను ఉపయోగించు కోవాలని విశాఖ ఎయిర్ పోర్టు పోర్టర్లు వినతిపత్రం సమర్పించారు.

ఆర్య వైశ్యుల మాదిరిగానే బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం కలిసికట్టుగా ఏర్పాటు చేస్తాం అన్నారు నారా లోకేష్‌. ఇందుకు టీడీపీ తరపున, ప్రభుత్వం తరపున సాయం అందిస్తాం అన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగులు విగ్రహం 194 రోజుల్లో పూర్తి చేశారు. అదే స్పూర్తితో ఆరునెలల్లో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేస్తామ‌న్నారు. విగ్రహావిష్కరణకు సీఎం, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, శెట్టిబలిజ కార్పోరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు.