newsseals.com
DEVOTIONAL

జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Posted by: VijayaBhaskar May 14, 2026
newsseals-JEOTTD

ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికా బద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు చేయనున్న విభాగాలు, గదులు, వైద్య సదుపాయాలు, మౌళిక వసతులు తదితర అంశాలను స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు.

అదేవిధంగా ప్రతి ఫ్లోర్‌లోని గదుల వారీగా ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్, వైద్య పరికరాలు, వైద్యులు , రోగుల అవసరాలకు అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలను లే అవుట్ ప్రణాళికలో పొందుపరచాలని అన్నారు. రెండో అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, ప్రతి గదిలో రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. తదుపరి శాఖల వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేఈవో, ఇంజనీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ రాదని స్పష్టం చేశారు.