ఇషాన్ కిష‌న్ పై కావ్య మార‌న్ సీరియ‌స్

VijayaBhaskar · May 29, 2026
Spread the love

మ్యాచ్ ముగిసేంత దాకా ఉండ‌క పోతే ఎలా..?

చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ను కోల్పోయింది బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన కావ్య మార‌న్ ఓన‌ర్ గా ఉన్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. కానీ ఆ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు ఒకే ఒక్క‌డు, యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను 5 ఫోర్లు, 12 సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 3 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. దీంతో భారీ స్కోర్ న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. అనంత‌రం ఛేద‌న‌లో చేతులెత్తేశారు కాటేర‌మ్మ కొడుకులు. ప్ర‌త్యేకించి ఫుల్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిష‌న్ దూకుడుగా ఆడిన‌ప్ప‌టికీ అన‌వ‌స‌ర‌మైన షాట్ కొట్ట‌బోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జ‌ట్టు ఓన‌ర్ కావ్య మార‌న్ సీరియ‌స్ అయ్యారు. త‌న తండ్రితో క‌లిసి మైదానంలో ఇషాన్ కిష‌న్ ను ఏకి పారేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ ,కావ్య మారన్ తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఇషాన్ 6, 6, 4 పరుగులు చేసి అవుటవడంతో కావ్య మారన్ అతనిపై బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. అతను మ్యాచ్‌ను ముగించాలని ఆమె కోరుకుంది, కానీ త‌ను అలా చేయలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారిద్దరి మధ్య 35 నిమిషాల పాటు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అక్కడున్న ఒక వ్యక్తి ప్రకారం, పరిస్థితిని చక్కదిద్దడానికి ముత్తయ్య మురళీధరన్ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది..