ఏపీకి తలమానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం శాసన సభ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాయంగా, రాష్ట్రానికి తలమానికంగా నిలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం కుప్పంకు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దృష్టి సారిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
రైతులు, వివిధ పథకాల లబ్దిదారులు, ఉద్యోగులు, అధికారులు, పార్టీ నేతలు, పారిశ్రామిక వేత్తలతో మూడు రోజుల పాటు సీఎం వరుసగా సమావేశాలు నిర్వహించారు. దశాబ్దాల నాటి కంగుంది రైతుల సమస్యకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. .61 ఏళ్లుగా పెండింగులో ఉన్న భూ సమస్యకు పరిష్కారం చూపించడం , ఇది తన హయాంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. రూ.9322 కోట్ల పెట్టుబడితో కుప్పానికి 30 పరిశ్రమలు తెచ్చేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా జూలై 1 వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరు పింఛన్ల పంపిణీ నుంచి నేటి వరకు 4 జిల్లాల్లో 6 రోజుల పాటు పర్యటించారు.