హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే తనిఖీ చేసి ప్రాథమిక నివేదికను అందించిందని తెలిపారు. ఆ తర్వాత అది పూర్తి స్థాయి నివేదికను ఇచ్చిందన్నారు. మేడిగడ్డ బ్లాక్ 7 వద్ద, బ్యారేజీ స్తంభాలు 1.2 మీటర్లు కుంగిపోయాయి. ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం , నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే ఈ ఘటన జరిగిందని నివేదిక చాలా స్పష్టంగా పేర్కొందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో, బ్యారేజీలలో నీటిని నింపడం ప్రమాదకరమని తన 365 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొందని చెప్పారు సీఎం.
NDSA నివేదిక ప్రకారం, మేడిగడ్డ, సుండిల్ల, అన్నారం బ్యారేజీ పనికి రాకుండా పోయిందన్నారు. మేడిగడ్డ బ్లాక్ 7 దెబ్బతినడం వల్ల, మొత్తం బ్యారేజీపై ప్రభావం పడి, దానికి నష్టం వాటిల్లిందన్నారు. దీంతో నీటి నిల్వ అసాధ్యమైంది అని అది తేల్చి చెప్పిందని తెలిపారు. ప్రస్తుత తీవ్రమైన పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి, మూడు బ్యారేజీల స్థిరీకరణ , పునరుద్ధరణ కోసం సమగ్ర అంచనాలు అవసరమని ఎన్డిఎస్ఎ తన కార్యనిర్వాహక సారాంశంలో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం, డిజైన్లు, మరమ్మతులు ఎన్డిఎస్ఎ లేదా సిడబ్ల్యుసి ఆమోదంతో మాత్రమే చేయాలని అది స్పష్టంగా పేర్కొంది అని ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారు.
పంపులు నీటిని ఎత్తిపోయడానికి, మేడిగడ్డ బ్యారేజీ 93.5 మీటర్ల వరకు నిండి ఉండాలన్నారు. అప్పుడే పంపులకు నీటి సరఫరా సాధ్యమవుతుందని తెలిపారు. నీటిని నిరంతరం ఎత్తి పోయడానికి, నీటి ప్రవాహాన్ని కొనసాగించాల్సి ఉందన్నారు.





