న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ ఎంపీలతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రంలో రహదారులకు సంబంధించి పెండింగ్ నిధులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుండి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును తన నివాసంలో కలిశారు. ఈ ఇద్దరు గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి, రూపకల్పన, అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు, ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి సంబంధించిన విషయాలపై వివరంగా చర్చించారు కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఈ సందర్బంగా వివరించారు. ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.





