అమరావతి : క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్. బుధవారం కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించి ప్రసంగించారు. జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, వారికి ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారని తెలిపారు. ఏ కార్యక్రమం తలపెట్టినా పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం, వారికి అండ అందించాలనే తపనతో రూపొందిన కార్యక్రమమే జనసేన చర్చా వేదిక కార్యక్రమం అని చెప్పారు మనోహర్. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలతోపాటు, పార్టీ కార్యకర్తల కష్టనష్టాలను వింటాం అని చెప్పారు.
వాటికి పరిష్కారం చూపేలా అధ్యక్షుల దృష్టికి విషయాలను తీసుకెళ్తాం. ప్రత్యక్షంగా కార్యకర్తల వద్దకే వెళ్లి వారితో మమేకమై వారి సమస్యలు వినడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. పార్టీ నాయకులే కారకర్తల వద్దకు వెళ్లి వారి సమస్యలు వినడం అనేది దేశ రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం అని అన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మొదటి సమావేశం కైకలూరు వేదికగా నిర్వహించడం ఆనందంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి. పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య నిరంతర సమన్వయం అవసరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సమీక్షించి ఒకే తాటిపైకి అందరినీ తీసుకొచ్చే ఈ కార్యక్రమం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు.





