newsseals.com

ప్ర‌భుత్వ ఆస్తుల‌ను వాణిజ్య ప‌రంగా వాడుకోవాలి

July 17, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంప్డ్ స్టోరేజీ, సౌరవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గనులు, నెడ్ క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్న విద్యార్ధుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు.

. పట్టణ ప్రాంతాల్లో రహదారులకు సమీపంలోనే మినీ టౌన్‌షిప్‌లా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా వీరిని తీర్చి దిద్దాలని అన్నారు. ఈ సమీక్షకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, వి.వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐఅండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు

Related News