హస్త కళాకారులు ఏపీకి రాయబారులు

అమరావతి : ఏపీలో చేనేత పరిశ్రమకు పెద్ద ఎత్తున ఆదరణ లభించేలా చేస్తున్నామన్నారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. గతేడాది విశాఖలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుదారులకు ఏపీ హస్త కళలతో కూడిన గిఫ్ట్ బాక్స్ లను అందజేశామన్నారు. హస్త కళాకారులకు కేవలం చేతి వృత్తిదారులు మాత్రమే కాదని, దేశ సంస్కృతీ సంప్రదాయాలకు రాయబారులు అని కొనియాడారు. హస్త కళాకారులకు 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.
అంతకు ముందు మంత్రి సవిత న్యూఢిల్లీలో ఆధునీకరించిన లేపాక్షి షో రూమ్ ను పరిశీలించారు. అక్కడ అమ్మకానికి పెట్టిన హస్త కళారూపాలను తిలకించారు. అమ్మకాలు పెంచేలా కృషి చేయాలని సిబ్బందికి దిశా నిర్దేశంచేశారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా, ఏపీహెచ్డీసీ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాదరావు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ ఎం.విశ్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో వైపు మూడు కీలక సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు తీపి కబురు చెప్పారు మంత్రి. ఈ సందర్బంగా రూ. 100 కోట్లతో గార్మెంట్స్ తయారీ యూనిట్ రానుందని, దీని ద్వారా 3 వేలకు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.