సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఫోకస్ పెట్టాలి
విజయవాడ : సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు నాలుగు శాతం తగ్గించగలిగామని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఈగల్ (EAGLE)’ వ్యవస్థ ద్వారా ఎస్పీలు, పోలీసు అధికారులు సమన్వయంతో గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
112 అత్యవసర స్పందన వ్యవస్థ ద్వారా స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించామని, పోలీసింగ్లో ‘గోల్డెన్ టైమ్’ అత్యంత కీలకమని హోంమంత్రి పేర్కొన్నారు. వేగవంతమైన స్పందన వల్ల నేరస్థులను త్వరగా అదుపులోకి తీసుకు రావడంతో పాటు బాధితుల్లో భరోసా పెరుగుతుందని అన్నారు. పోలీసు శాఖ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ఇప్పటికే 6,000 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశామని, భవిష్యత్తులో కూడా ప్రతి జాబ్ క్యాలెండర్లో కొత్త పోలీసు పోస్టులను భర్తీ చేస్తూ శాఖను మరింత బలోపేతం చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి, నూతన తరహా నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు రోజుల రిట్రీట్లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, రౌడీయిజం నిర్మూలన, ఫ్యాక్షన్ రాజకీయాల నియంత్రణ, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మతసామరస్య పరిరక్షణ వంటి ఆరు కీలక అంశాలపై వర్కింగ్ గ్రూపులు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా రూపొందే సూచనలు రాష్ట్ర పోలీసింగ్కు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా మారనున్నాయని చెప్పారు.