బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ

తిరుపతి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యాగును తెరిచి పరిశీలించారు. బ్యాగులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ బ్యాగు హైదరాబాద్కు చెందిన మహేష్ కు చెందినదిగా గుర్తించారు.
అప్పటికే తాను బ్యాగును మరిచి పోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించారు. పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా సదరు భక్తుడికి అప్పగించారు. ఈసందర్భంగా పోయిందని అనుకుని తీవ్ర మనో వేదనకు గురైన భక్తుడు ఆనందం వ్యక్తం చేశాడు. ఇదంతా ఆ శ్రీ వేంకటేశ్వురుడి మహిమేనని పేర్కొన్నాడు. తాను పోగొట్టుకున్న బ్యాగును ఉన్నది ఉన్నట్టుగా అందించిన టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.