పేపర్ లీక్ లపై కఠిన చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: పరీక్షా పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం జాతిని ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోలో పునరుద్ఘాటించారు. ఆ వీడియోలో, దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ప్రధాన మంత్రి అన్నారు. పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ఇందులో పాలుపడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడటానికి కేంద్ర కేబినెట్ అదనపు చర్యలు చేపట్టనుందని ఆయన తెలిపారు.
పరీక్షా అవకతవకలను అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగా వేగవంతమైన విచారణలు, నేరస్థులకు కఠిన శిక్షలు ఉండేలా ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి, నియామకాలు , పోటీ పరీక్షల సమగ్రతను కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న సంకల్పాన్ని రాబోయే కేబినెట్ నిర్ణయాలు మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీలు లేదా పరీక్షా మోసాల ద్వారా దేశ యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయాలని ప్రయత్నించే వ్యక్తులు తీవ్రమైన చట్ట పరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పారదర్శకమైన, నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ప్రతిపాదిత చర్యలు ఇప్పటికే ఉన్న ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పరీక్షలు నిర్వహించే బాధ్యత గల ఏజెన్సీలలో జవాబుదారీతనాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.