newsseals.com

నేత‌న్న‌ల‌ను మోసం చేసిన జ‌గ‌న్ రెడ్డి

July 26, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ‌, చేనేత రంగ శాఖ మంత్రి ఎస్ స‌విత నిప్పులు చెరిగారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగ‌న్ నేత‌న్న‌లను తీవ్రంగా మోసగించారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ఇష్టారాజ్యంగా అమలుచేసిందని విమర్శించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేసి, కేవలం నేతన్న నేస్తం పథకం మాత్రమే అమలు చేసిందన్నారు. ఈ పథకం కింద అర్హులతో పాటు వైసీపీకి చెందిన ఫేక్ చేనేతలకు కూడా నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సాయంతో పాటు పెన్షన్లు అందించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేనేతలకు స్వర్ణ యుగమేనన్నారు. 2014-19లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతలకు మేలు చేసేలా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేనేతలకు చేయూతగా నిలుస్తున్నామని తెలిపారు.

ప్రజాబంధు ప్రగడ కోటయ్య విగ్రహానికి మంత్రి సవిత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రగడ కోటయ్య తనయుడు వెంకట శేషసయిన, కోడలు పద్మావతి, కుమార్తెను, అల్లుడిని, ఇతర కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. మంత్రి సవితను స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, చిలకలపూడి పాపారావు, పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జి.ధనుంజయరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నేతన్నలు పాల్గొన్నారు.

Related News