ఈ ఫార్ములా కేసు లో నాంపల్లి కోర్టుకు కేటీఆర్

హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి స్కాం చోటు చేసుకుందని, మనీ లాండరింగ్ వ్యవహారం జరిగిందని ఆరోపించింది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరూ మొదటి రోజు విచారణకు స్వయంగా హాజరు కావాలని నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
దీని ప్రకారం కేటీఆర్తో పాటు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ , ఇతర ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. మే 14న అవినీతి నిరోధక శాఖ (ACB) దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితులకు సమన్లు జారీ చేసింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదంతా కావాలనే కుట్ర పూరితంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను బద్నాం చేయడం తప్పా మరోటి కాదన్నారు. ఆయన నేరుగా దమ్ముంటే తనతో ఎదుర్కోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇవాళ తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.