రైతుల సంక్షేమానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత

అమరావతి : ప్రస్తుతం ఆశాజనకంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలోకి నీరు వస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము చేసిన విజ్ఞప్తికి కేంద్రంలోని మోదీ సర్కార్ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. పంటల బీమా నమోదు ప్రక్రియకు అడ్డంకి లేకుండా రైతులకు మేలు చేకూర్చేలా ఆగస్టు 15 వరకు గడువు పొడిగించిందన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా నమోదు చేయించుకుని భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా రక్షణ పొందాలని సూచించారు కింజారపు అచ్చెన్నాయుడు. రైతులు సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ ద్వారా స్వయంగా లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో ఈనెల 15లోగా పంటల బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, పోర్టల్పై చివరి రోజులలో ఏర్పడే రద్దీని నివారించేందుకు వీలైనంత త్వరగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.