కేబినెట్ విస్తరణపై రామలింగారెడ్డి కామెంట్స్

బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై మంత్రి రామలింగ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొలువు తీరిన మంత్రివర్గం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదన్నారు. ఇది పూర్తిగా యువ, అనుభవజ్ఞులైన మంత్రులతో కూడిన సమతుల్య మంత్రివర్గం అని పేర్కొన్నారు. గతంలో ఇందులో ఇద్దరు మహిళా మంత్రులు ఉండేవారు, ఇప్పుడు మరొకరు అదనంగా చేరారని అన్నారు. పదవులను ఆశించేవారు చాలా మంది ఉన్నారు, కానీ అవకాశం మాత్రం 34 మందికే ఉంటుందని చెప్పారు. జిల్లాలు , ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారని తెలిపారు.
అలాగే మతం , సామాజిక వర్గాల అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు రామ లింగా రెడ్డి. అలాగే, అఖిలపక్ష సమావేశం గురించి ఆయన మాట్లాడారు. సమావేశం బాగా జరిగింది, ప్రతిపక్ష నాయకులందరూ సహకరించారు.పరిస్థితి మెరుగు పడుతోంది, కానీ ఆగస్టులో మరిన్ని వర్షాలు కురుస్తాయని తాము అంచనా వేస్తున్నామని అన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులలోకి నీరు సమృద్దిగా చేరుతోందన్నారు. అవన్నీ జలకళను సంతరించుకున్నట్లు తెలిపారు రామలింగా రెడ్డి.