ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి డిమాండ్ చేశారు . అంతేకాకుండా బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నివేదికల ప్రకారం ఎక్స్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక వినోద పేజీ ఈ ఆరోపిత డీప్ఫేక్ చిత్రాలను పంచుకోవడంతో, మృణాల్ బహిరంగ ప్రకటన జారీ చేశారు. తన గుర్తింపును ఉపయోగించి నకిలీ కంటెంట్ను సృష్టించడం లేదా పంచుకోవడం ఆమోద యోగ్యం కాదని ,అది తన హక్కులను ఉల్లంఘిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఇలాంటి మార్ఫింగ్ చేసిన చిత్రాలను సృష్టించడం, అప్లోడ్ చేయడం లేదా ప్రచారం చేయడం కొనసాగించే ఎవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మృణాల్ హెచ్చరించారు. నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడానికి ఏఐ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేయడాన్ని సహించ కూడదని ఆమె నొక్కి చెప్పారు. వినోద పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. డిజిటల్ గుర్తింపు దుర్వినియోగం నుండి వ్యక్తులను రక్షించడానికి కఠినమైన చట్టాలు , బలమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది నటీనటులు ఇటువంటి కంటెంట్కు వ్యతిరేకంగా గళం విప్పారు.







