యాంకర్ అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : జై శ్రీరామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భజరంగ్ దళ్ , తదితర హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సోమవారం యాంకర్ అనసూయ భరద్వాజ్పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆమెను హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల స్థానిక బీజేపీ నేతలు ఆమెపై బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ మతంపై అనసూయ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశాయని పేర్కొంటూ, ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అనసూయ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన పోలీస్ కేసుపై స్పందిస్తూ, తాను వెనక్కి తగ్గేది లేదని అనసూయ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తన మాటలను ఉద్దేశ పూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుని, పూర్తిగా భిన్నమైన కథనాన్ని సృష్టిస్తున్నారని ఆమె తన సోషల్ మీడియా పేజీలో ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఒక నిర్దిష్ట వర్గం వారి గురించి మాత్రమే మాట్లాడానని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని లేదా ఏ విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదని అనసూయ స్పష్టం చేశారు. పోలీసులు ఫిర్యాదును నమోదు చేసి, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.