ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం : సీఎం

అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలిపారు. ఆగస్టు 31న అధికారికంగా తాను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గత 30 ఏళ్ల క్రితం తాను చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు నెరవేరుతోందని ఆయన స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొన్నప్పటి ఫోటోతో పాటు, “వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు” అని నాయుడు ప్రస్తావించారు.
ఆనాటి ఫోటోలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నారా చంద్రబాబు నాయుడు. ఇన్నేళ్లు పట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ దేవుడు తనకు ఇచ్చిన వరమని పేర్కొన్నారు దీనిని ప్రారంభించడం. ప్రతి రైతు పొలానికి సాగునీరు, యువతకు ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని సాగు నీరు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. అలాగే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యను కూడా టిడిపి కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆయన జోడించారు.