‘పునర్నవి’ డాక్యుమెంటరీ ఎందరికో స్పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన “పునర్నవి” డాక్యుమెంటరీ ప్రివ్యూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసాధారణ ధైర్య సాహసాలతో ఎన్నో సవాళ్లను అధిగమించిన సుమతి చురుకంటిని ఘనంగా సన్మానించడం జరిగింది. Mrs. Telangana, Mrs. India రన్నరప్గా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి, రెండుసార్లు క్యాన్సర్ను జయించిన సుమతి జీవన ప్రయాణం ప్రతి మహిళకు, ప్రతి పోరాట యోధుడికి గొప్ప స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా, తిరిగి నిలబడటమే అసలైన విజయం అని పేర్కొన్నారు. కాలం ప్రతీసారి పరీక్ష పెడుతుందని దానిని గుర్తించి మనో ధైర్యంతో ముందుకు వెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ స్ఫూర్తిదాయక కథను దృశ్య రూపంలోకి తీసుకొచ్చిన భీమగాని సుధాకర్ కి, సంతోష్ ఫిల్మ్స్ బృందానికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. ఈ సందర్బంగా “పునర్నవి” డాక్యుమెంటరీ ఘన విజయం సాధించాలని కోరారు.