తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 పై ఫోకస్
హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలపై ఫోకస్ పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్లో తన అధ్యక్షతన కేబినెట్ సబ్-కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 – ఇన్వెస్ట్ తెలంగాణను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందుకు సంబంధించి ప్రజాభవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటుతో పాటు నిపుణులు, కీలక అధికారులతో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. గత సమ్మిట్లో కుదిరిన ఎంవోయూల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత రోడ్షోలు చేపట్టాలని అన్నారు . ప్రముఖ పెట్టుబడిదారులకు ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి కమిటీకి నిర్దేశించిన టైమ్లైన్ ప్రకారం పనుల పూర్తి చేయాలన్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్య స్థానంగా నిలపడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.