తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. పౌర్ణమి సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా తిరుమలలో రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ జెబుతున్నాడు.
ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులుపనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.