newsseals.com
News

మెగా డీఎస్సీ రిజర్వేషన్లలో ఎటువంటి లోపాలు లేవు

Posted by: VijayaBhaskar August 9, 2026
neewsseals-APDSC

విజ‌య‌వాడ : మెగా DSC-2025 ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో ‘బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల’ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతరులకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఖండించింది. నియామకాలన్నీ పూర్తిగా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని స్పష్టం చేసింది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ నియామక ప్రక్రియపై అనవసరమైన సందేహాలు తలెత్తుతున్నాయని కమిషనర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నియామక ప్రక్రియ 2023 ఆగస్టు 2 నాటి G.O.Ms. నం. 77 ప్రకారం జరిగిందని తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రస్తావనకు వచ్చిన రెండు కేసుల గురించి వివరిస్తూ, ఆమె ఇలా అన్నారు.

జోన్-1 పరిధిలో PGT (ఇంగ్లీష్) విభాగంలో 92వ ర్యాంకు సాధించిన EWS అభ్యర్థి దేవగుప్తాపు సంతోషి పార్వతి ఎంపిక కాలేదు. ఎందుకంటే అందుబాటులో ఉన్న రెండు EWS పోస్టులలో ఒకటి 84వ ర్యాంకు వరకు ఉన్న జనరల్ మెరిట్ అభ్యర్థికి కేటాయించబడింది, మరొకటి 40 శాతం దృష్టి లోపం ఉన్నట్లు ధృవీకరణ పత్రం కలిగిన PwBD అభ్యర్థి అశోక్ కుమార్ మనివెల్తికి దక్కింది. అలాగే, కడప జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) విభాగంలో EWS అభ్యర్థుల జాబితాలో 68వ ర్యాంకు పొందిన V.V.V. భాస్కర్ రెడ్డికి ఎంపిక దక్కలేదు. ఎందుకంటే మొత్తం ఎనిమిది EWS పోస్టులలో ఏడు పోస్టులు 67వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులతో భర్తీ చేయబడ్డాయి, మిగిలిన ఒక పోస్టు వినికిడి లోపం ఉన్న PwBD అభ్యర్థి గోనిగుంట్ల సుభాషిణికి కేటాయించబడింది. మహిళలు, PwBD అభ్యర్థులు, మాజీ సైనికులు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంబంధించిన హారిజాంటల్ రిజర్వేషన్లను ప్రత్యేక రోస్టర్ పాయింట్ల ద్వారా కాకుండా, ఆయా వర్టికల్ కమ్యూనిటీ రోస్టర్ల పరిధిలోనే సర్దుబాటు చేశామని అన్సారియా స్పష్టం చేశారు.