ఉదయ్ కృష్ణ రెడ్డిని కస్టడీకి అప్పగించాలి

హైదరాబాద్ : శిక్షణలో ఉన్న IPS అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డిని మరో 7 రోజుల కస్టడీకి అప్పగించాలని అత్తాపూర్ పోలీసులు కోరారు. కృష్ణ రెడ్డి విచారణలో సహకరించకుండా దాటవేసే ధోరణిని ప్రదర్శించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో తోటి అధికారిపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా రెడ్డిని, రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. నిందితుడు వెల్లడించిన కీలక విషయాలను ధృవీకరించడానికి అదనపు సమయం అవసరమని ఉప్పర్పల్లి కోర్టుకు తెలియజేస్తూ, పోలీసులు ఈ విజ్ఞప్తి చేశారు. కృష్ణ రెడ్డి విచారణలో సహకరించలేదని, ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారని లేదా ఆ సంఘటనలు తనకు గుర్తులేవని చెప్పారని పేర్కొన్నారు.
ఇరుపక్షాల ప్రాథమిక వాదనలు విన్న తర్వాత, కస్టడీ పిటిషన్పై పూర్తి స్థాయి వాదనలను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఇప్పటివరకు కేవలం ఒక మొబైల్ ఫోన్ను మాత్రమే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పరిశీలన కోసం పంపినట్లు సజ్జనార్ తెలిపారు. గత కస్టడీ సమయంలో, మేము ప్రధానంగా ఫోన్లోని సమాచారం , ఆత్మహత్య లేఖకు సంబంధించిన అంశాలపై అతన్ని ప్రశ్నించాము. కోర్టు మళ్లీ కస్టడీకి అనుమతిస్తే, ఈ కేసుతో సంబంధం ఉన్న భౌతిక సాక్ష్యాలు ఏవైనా లభిస్తాయేమో నిర్ధారించు కోవడానికి ఒక బృందాన్ని ప్రకాశం జిల్లాలోని అతని స్వగ్రామానికి కూడా పంపుతాం అని సజ్జనార్ పేర్కొన్నారు.
మరో వారం రోజుల కస్టడీ కోసం పోలీసులు చేసిన విజ్ఞప్తిని కృష్ణ రెడ్డి తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. CCTV నిఘా లేని గదిలో నిందితుడిని విచారించారని, విచారణ సమయంలో కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఆ శిక్షణార్థ అధికారిని బెదిరించారని, దీనివల్ల అతను భయభ్రాంతులకు గురై కోర్టులో కుప్పకూలి పోయాడని రక్షణ పక్షం ఆరోపించింది.