newsseals.com
News

ఎంపీ గురుమూర్తి విన్న‌పం రైల్వే శాఖ ఆమోదం

VijayaBhaskar November 14, 2025
newsseals-MPGurumurthy
Spread the love

రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియ‌ర్

తిరుప‌తి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్‌ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపున‌కు మాత్రమే యాక్సెస్ రోడ్డు ఉండ‌డంతో వాహ‌నదారుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. దీనిని గ‌మ‌నించిన ఎంపీ ఎడ‌మ వైపు కూడా యాక్సిస్ రోడ్డు ను ఏర్పాటు చేయాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ‌కు విన్న‌వించారు. దీనిపై స‌ద‌రు శాఖ ఆమోదం తెలిపింది. తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్‌కు పాత హీరోహోండా షోరూం వద్ద రైల్వే గేట్ నంబర్‌ 107 వైపు మాత్రమే యాక్సెస్ ఉంది. భవిష్యత్తులో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముందు చూపుతో ఎంపీ గురుమూర్తి గుర్తించారు.

అందుకే కాటన్ మిల్ గేట్‌ నంబర్‌ 108 వైపుగా కూడా అదనపు యాక్సెస్ రోడ్డు అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవకి లేఖ రాశారు. ఎంపీ చేసిన‌ ప్రతిపాదనపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన జరిపి యాక్సెస్ రోడ్డు ఏర్పాటు సాధ్యమని తేల్చింది. ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుండి మంగళం, లీలామహల్ సర్కిల్ వైపున‌కు వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.